||సుందరకాండ. ||

||తత్త్వదీపిక - పదునాలుగొవ సర్గ ||

||ఆనందమయ కోశములో హనుమంతుడు||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ చతుర్దశస్సర్గః

తత్త్వదీపిక
ఆనందమయ కోశములో హనుమంతుడు

పదునాలుగొవ సర్గలో కథ క్లుప్తముగా ఇలా చెప్పవచ్చు.

హనుమంతుడు ప్రవేశించిన అశోకవనము సుందరమైన వనము.
ఆ వనము అన్నిరకముల ఫల పుష్పవృక్షములతో నిండియుండెను.
ఆ వృక్షముల క్రింద గొడుగులు , గొడుగుల క్రింద అరుగులు నిర్మింపబడెను. హనుమంతుడు అక్కడే దట్టముగా ఆకులతో అలముకొనిన
బంగారు శింశుపా వృక్షము చూచెను.
ఆ వృక్షము ఎక్కిన హనుమంతుడు రాముని దేవి తప్పక ఇచట రాగలదు అని భావించి ఆ చెట్టుపైన ఎవరికీ కానరాకుండా,
సీతమ్మకై ఎదురుచూచుచూ కూర్చుని ఉండెను.

అది జరిగిన కథ.

ఆ కథలో మనకు కనపడేది వాల్మీకి వర్ణనలే.

ఈ సర్గ "స ముహూర్తమివ ధ్యాత్వా"- అంటూ మొదలుపెడతాడు
ధ్యాత్వా అన్నమాటలో
మనకి ధ్యానించి ఆ వనములో ప్రవేశించాడు అని స్ఫురిస్తుంది.
ఆ మాటతో పదమూడవ సర్గలో హనుమ చేసిన ప్రార్థనలను మళ్ళీ మనకి స్ఫురిస్తాయి.

అలా ప్రవేశిస్తున్న హనుమంతుడిని వర్ణిస్తూ వాల్మీకి అంటాడు-
"సంహృష్ట సర్వాంగః".
అంటే అన్ని అంగములలో ఆనందము కలిగియున్నవాడు అని.
హనుమంతుడు మంచి ఆనందముతో ఉత్సాహముతో ప్రవేశిస్తాడు అన్నమాట.
ఎందుకు ఆ వుత్సాహము?
"మనసా చాధిగమ్య తామ్"
మనస్సులో సీత ను చేరాడుట.

ఆ వనములో ఎలా ప్రవేశిస్తాడు?
"జ్యాముక్త ఇవ నారాచః"
అంటే లాగి వదిలిన బాణమువలె అ వనములో ప్రవేశిస్తాడు.
ఇది మనకి బయలుదేరేముందు హనుమంతుడు చెప్పిన మాటలు గుర్తుతెస్తాయి.
ఆ మాటలు తనను తాను రామబాణముతో పోల్చుకొని చేపట్టిన కార్యము సాధిస్తాను అని అన్నమాటలు.
ఆ మాటలు ఈ అన్వేషణ అంతిమచరణములో వుందా అని మనకి స్ఫురించే మాటలు.

అక్కడ పక్షులు ఎలా వున్నాయి?
"సుఖప్రసుప్తాన్ విహగాన్"
ఆ పక్షులు హాయిగా సుఖముగా నిద్రించుచున్నాయిట.

ఆ వనములో వృక్షములు హనుమంతుడు దూసుకుపోతూవుంటే
"ముముచుః పుష్ప వృష్టయః"
ఆ వృక్షములు హనుమంతుని మీద పుష్పవృష్టి కురిపించాయిట.

హనుమ ఎలావున్నాడు?
"పుష్పావకీర్ణః శుశుభే హనుమాన్ మారుతాత్మజః"
పుష్పములతో కప్పబడి హనుమంతుదు శోభిస్తున్నాడుట.
పుష్పములతో నిండిన పర్వతము వలె ఉన్నాడుట.

ఆ పుష్పములతో కప్పబడిన హనుమంతుని చూచి
"సర్వాణి భూతాని" అంటే ఆన్ని భూతములూ
"వసంత ఇతి మేనిరే"
వసంతఋతువే హనుమంతుని రూపములో వచ్చెనా అని అనుకున్నాయిట.

అక్కడ భూమికూడా
"రరాజ వసుధా తత్ర"
అక్కడ భూమికూడా శోభిస్తూవుందిట.

అప్పలాచార్యులవారు తత్త్వదీపికలో రాస్తారు ఆ అశోకవనము మీద.
ఆ వనము పురుషునిచే ఉపభోక్త అయి
అంగరాగము చెరిగిపోయి, కేసపాసములు జల్లుకుపోయి ,
నఖదంతక్షతములతో బడిలి ఉన్న యువతి వలె భాసిస్తున్నదట.
అంటే ఆమె అనందాతిశయములో ఉన్నదన్నమాట.
అంటే ఆ అశోకవనము ఆనందము కలిగిస్తూవున్నదన్నమాట.

అక్కడ హనుమ ఒక అద్భుతమైన పర్వతమును చూచాడుట
"దదర్శ హరిశార్దూలో రమ్యం జగతి పర్వతమ్"
"జగతి పర్వతమ్" అన్న మాట విశ్లేషిస్తూ ఇలా రాస్తారు.
"జగతి లోకే రమ్యం
సున్దరవస్తుభ్యోఽపి పరమ సుందరమ్,
తీర్థస్తు జగతి పర్వతమ్"
"ఏతత్ సదృశం రమ్యం కించిన్నాస్తి ఇతి అర్థః |
అంటే ఆ పర్వతము అతి సుందరమైన పర్వతము అని.
అంతకన్న సుందరమైనది ఇంకోటి లేదు అని.

ఆ చెట్లలో ఆకులు బంగారు వర్ణముతో ప్రకాశిస్తున్నాయిట.
ఆ ప్రకాశము లో హనుమ ఎలా వున్నాడు ?
హనుమ తాను కూడా బంగారు వర్ణము పొందానా అని అనుకున్నాడుట.
అంటే మొదటిలో "సంహృష్ట సర్వాంగః " చెప్పబడిన హనుమ,
అంటే అన్ని అంగములలో ఆనందభూషితుడైన హనుమ
ఇంకా ఆనందములో వున్నడన్న మాట.

ఇలాంటి వర్ణనలు ఇంకా వున్నాయి.
ఇలా వాల్మీకి ప్రతి వర్ణనలోనూ మనకి కలిగించేది కనపడేది ఆనందము ఆనందముయొక్క రేఖలు.

ఇది సుందర వనములో సుందరుని వర్ణలు
ఆ వర్ణనలలో ఆనంద రేఖలే కనిపిస్తాయి.

అందుకే ఇది ఆనందమయకోశమా అని స్ఫురిస్తుంది.
అదే అశోకవనములో ఆనందమయకోశములో ఉన్న హనుమంతుని కథ:

||ఓమ్ తత్ సత్||